సీఎం చంద్రబాబు సమక్షంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థతో జీవీఎంసీ కీలక ఒప్పందం

  • విశాఖ అభివృద్ధికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ రుణం
  • స్మార్ట్ వైజాగ్‌కు మరో ముందడుగు
  • రూ.498 కోట్ల భారీ రుణం
విశాఖపట్నం అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. నగర మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) తన సొంత ఆర్థిక పటిష్టతతో ఏకంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి భారీ రుణం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం నాడు జీవీఎంసీ, ఐఎఫ్‌సీ ప్రతినిధులు ఈ కీలక రుణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా నగర పాలక సంస్థలు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించే దిశగా జీవీఎంసీ దేశానికే ఒక కొత్త మార్గాన్ని చూపింది.

ప్రాజెక్టు వివరాలు, ప్రయోజనాలు

విశాఖలోని మధురవాడ జోన్-2లో అత్యాధునిక మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ రుణం ఉపయోగించనున్నారు. మొత్తం రూ.553 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఐఎఫ్‌సీ రూ.498 కోట్లను రుణంగా అందిస్తోంది. మిగిలిన మొత్తంలో రూ.45.64 కోట్లను అమృత్ 2.0 పథకం కింద, మరో రూ.9.36 కోట్లను జీవీఎంసీ తన సొంత నిధుల నుంచి భరించనుంది. విశేషమేమిటంటే, ఈ రుణాన్ని జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల నుంచే 15 ఏళ్లలో తిరిగి చెల్లించనుంది. దీనికి 8.15 శాతం ఫ్లోటింగ్ వడ్డీ రేటు వర్తిస్తుంది.

రాబోయే 30 ఏళ్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 100 శాతం భూగర్భ డ్రైనేజీ నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్, లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం, రీసైక్లింగ్ చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతంలో అంటువ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణకు, వరద నీటి నిర్వహణకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.

రైతుల సమస్యలపై సీఎం దృష్టి

ఈ కీలక ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలు, ఇతర పాలనాపరమైన అంశాలపై ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని, మరో 10 రోజుల్లో అదనంగా 23,592 మెట్రిక్ టన్నులు రానుందని అధికారులు తెలిపారు. 

అదేవిధంగా, ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు కనీస ధర రూ.1200 తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తురకపాలెం గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య నాటకమాడిన వారిపై విచారణ జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News

Chandrababu Naidu Visakhapatnam GVMC IFC Andhra Pradesh Sewage System Infrastructure Development Loan Agreement AMRUT 2.0 Farmers Issues