సామాన్యుడికి భారీ ఊరట.. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ సున్నా

  • ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా రద్దు
  • 18 శాతం పన్ను శ్లాబ్ నుంచి సున్నా కేటగిరీలోకి మార్పు
  • ఇకపై చౌకగా మారనున్న ఇన్సూరెన్స్ పాలసీలు
  • సామాన్యులకు మరింత అందుబాటులోకి బీమా సేవలు
  • బీమా కంపెనీలపై స్వల్పకాలికంగా ప్రభావం పడే అవకాశం
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఈ పాలసీల ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. జీఎస్టీ విధానంలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా ఆరోగ్య, జీవిత బీమాలను సున్నా పన్ను కేటగిరీలోకి తీసుకువస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీమా పాలసీలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి.

పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగాన్ని పెంచడానికి దోహదపడుతుందని, ఎక్కువ మంది ప్రజలు బీమా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి బీమా కొనేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. టర్మ్ లైఫ్, యూలిప్, ఎండోమెంట్ వంటి అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

అయితే, ఈ నిర్ణయం వల్ల బీమా కంపెనీలపై స్వల్పకాలికంగా కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా వేసింది. జీఎస్టీ రద్దుతో కంపెనీలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) లభించదని, దీనివల్ల వారి లాభదాయకత కొంతమేర తగ్గొచ్చని పేర్కొంది. కానీ, ప్రీమియంలు తగ్గడంతో పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగి, దీర్ఘకాలంలో కంపెనీలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది.

ఈ నిర్ణయంపై రెన్యూబై సీఈఓ, సహ వ్యవస్థాపకుడు బాలాచందర్ శేఖర్ మాట్లాడుతూ.. "జీఎస్టీ మినహాయింపు వల్ల బీమా సేవలు దేశంలో మరింత విస్తరిస్తాయి. ముఖ్యంగా మొదటిసారి పాలసీ తీసుకునేవారు, మధ్యతరగతి ప్రజలకు ఇది గొప్ప వరం" అని అన్నారు. 

ఇక్రా కార్పొరేట్ సెక్టార్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ స్పందిస్తూ.. "ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను లేకపోవడం వల్ల ఎక్కువ మంది పాలసీలు తీసుకుంటారు. ఇది పరోక్షంగా ఆసుపత్రుల రంగానికి కూడా మేలు చేస్తుంది. ప్రజలందరికీ నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్య దోహదపడుతుంది" అని వివరించారు.


More Telugu News