మీరట్‌లో కొత్త బెడద.. దిగంబర ముఠా ఆగడాలు!

  • మీరట్ జిల్లాలో దిగంబర ముఠా హాల్‌చల్
  • తీవ్ర భయాందోళనకు గురవుతున్న మహిళలు
  • అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దిగంబర ముఠా సంచలనం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పలు గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ కొంతమంది పురుషులు, మహిళలపై దాడికి పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

భారాలా గ్రామంలో ఇటీవల ఓ మహిళ ఒంటరిగా కార్యాలయానికి వెళ్తుండగా, నిర్మానుష్య ప్రదేశంలో దిగంబర ముఠాకు చెందిన వ్యక్తులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదే తరహాలో ఇదివరకే నాలుగు దాడులు జరిగాయని గ్రామస్తులు తెలిపారు.

స్థానికంగా ముగ్గురు మహిళలు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ భయం, అవమానంతో ఇంతవరకు బయటకు చెప్పలేకపోయారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

పలు గ్రామాల్లో ప్రజలు ఈ ముఠాను చూశామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 


More Telugu News