Gauri Lankesh: "డియర్ గౌరీ" అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్

Prakash Raj Emotional Post on Gauri Lankesh Anniversary
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ వర్ధంతి సందర్భంగా నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. "డియర్ గౌరీ, నిన్ను చాలా మిస్ అవుతున్నా. నిన్ను చంపిన వాళ్లు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే, ప్రజల కోసం గొంతెత్తిన వారు జైళ్లలో మగ్గిపోతున్నారు. నీ గొంతును మేం ఎప్పటికీ మూగబోనివ్వమని ప్రమాణం చేస్తున్నాం. మేము నిన్ను పాతిపెట్టలేదు.. విత్తనంగా నాటాం" అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం, 2017 సెప్టెంబర్ 5న, బెంగళూరులోని తన నివాసం వద్ద గౌరీ లంకేశ్ (55) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, బైక్‌పై వచ్చిన ముసుగు దుండగులు ఆమెపై అతి సమీపం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. సమాజంలోని అసమానతలు, మూఢనమ్మకాలు, మతతత్వానికి వ్యతిరేకంగా తన పత్రిక ద్వారా నిర్భయంగా గళమెత్తిన గౌరీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గౌరీ హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ దేవాలయానికి చెందిన మతాధికారి అక్రమాలపై ఆమె కీలక ఆధారాలు సేకరిస్తున్నారని, ఆ విషయాలను బయటపెట్టకుండా ఉండేందుకే ఈ హత్య జరిగి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య తర్వాత ఆమె ఆఫీస్‌లోని ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

ఈ హత్యపై దేశవ్యాప్తంగా "ఐ యామ్ గౌరీ" పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కేసును విచారించిన పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అయితే, ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిందితులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం గమనార్హం. న్యాయం కోసం గౌరీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.
Go Back to Shorts
Gauri Lankesh
Prakash Raj
Gauri Lankesh murder
journalist
social activist
Bengaluru
I am Gauri
religious leader
justice for Gauri Lankesh

More Telugu News