Nirmala Sitharaman: బెంజ్ కారుపై, హవాయి చెప్పులపై ఒకే జీఎస్టీ వేయలేం కదా: ఒకే పన్ను విధానంపై నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman on One Nation One Tax Feasibility
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా 'ఒకే దేశం-ఒకే పన్ను' విధానాన్ని అమలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విలాసవంతమైన బెంజ్ కారుపై, సామాన్యుడు వాడే హవాయి చెప్పులపై ఒకే రకమైన పన్ను విధించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె తేల్చి చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక అభివృద్ధిలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను రేటును అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీని ప్రవేశపెట్టిన దివంగత నేత అరుణ్ జైట్లీతో తనకు జరిగిన సంభాషణను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. "బెంజ్ కారును, హవాయి చెప్పులను ఒకే గాటన కట్టి ఒకే పన్ను విధించగలమా? అని జైట్లీ గారు అనేవారు. బెంజ్ కారు కొనే వ్యక్తి ఎక్కువ పన్ను చెల్లించగలడు. కానీ, హవాయి చెప్పులు కొనే సామాన్యుడు అంత భారం మోయలేడు. అందుకే ప్రస్తుతానికి దేశంలో ఒకే జీఎస్టీ రేటు లేదు. అలా చేయడం అన్యాయం అవుతుంది" అని నిర్మల వివరించారు.

దేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే ఒకే పన్ను విధానం గురించి ఆలోచించగలమని ఆమె తెలిపారు. ప్రభుత్వం తగ్గించిన పన్నుల ప్రయోజనాలు పూర్తిగా వినియోగదారులకు చేరేలా కఠినమైన పర్యవేక్షణ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో, పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పునరుద్ధరించే ప్రణాళికలు కూడా లేవని ఆమె తేల్చి చెప్పారు.
Go Back to Shorts
Nirmala Sitharaman
GST
Goods and Services Tax
One Nation One Tax
Benz Car
Hawaii Slippers

More Telugu News