YS Sharmila: కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణ మృదంగమే నిదర్శనం: షర్మిల

YS Sharmila slams government over Turakapalem deaths
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతుండటంతో అసలేం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వరుస మరణాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండగా, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వివరాల్లోకి వెళితే, తురకపాలెం ఎస్సీ కాలనీలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలన్నీ తాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న ఒక క్వారీ కుంటపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, ఈ నీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయా? లేక మరేదైనా అంతుచిక్కని వ్యాధి ప్రబలిందా? అనే కోణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు గల కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, నెలలు గడుస్తున్నా మరణాలు ఆగకపోవడంతో గ్రామస్థుల్లో భయం రెట్టింపవుతోంది.

ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

ఈ విషాద ఘటనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణాలే నిదర్శనమని ఆమె విమర్శించారు. "గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉన్నట్లా? లేనట్లా? ఇప్పటికి 35 మంది ఒకే విధంగా చనిపోతే కారణం కనుక్కొని, నివారించకపోవడం సిగ్గుచేటు" అని ఆమె మండిపడ్డారు. ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేశారు. "తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వైద్యారోగ్య శాఖ తరఫున ఉన్నతస్థాయి కమిటీ వేసి, గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి" అని షర్మిల కోరారు. మరణాలకు కలుషిత నీరా, కల్తీ సారా కారణమా, లేక పారిశుద్ధ్య లోపమా అనేది వెంటనే తేల్చి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Turakapalem
Andhra Pradesh
Guntur district
Mysterious deaths
Contaminated water
AP Congress
Health crisis
Government failure
Medical camp

More Telugu News