Revanth Reddy: ఖైరతాబాద్ గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

Revanth Reddy Offers Prayers at Khairatabad Ganesh
షార్ట్స్‌లో చూడండి
గణేశ్ నిమజ్జనానికి ఒకరోజు ముందు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశ్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ నగరంలోనూ ఇలాంటి సౌకర్యం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరం అన్ని మతాలను గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన కొనియాడారు. శనివారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భక్తిశ్రద్ధలతో, జాగ్రత్తగా పూర్తిచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్ బండ్ సహా ఇతర ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని ఆయన వెల్లడించారు.

ఆగస్టు 27న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 'విశ్వశాంతి మహాశక్తి గణపతి' పేరుతో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి, స్టీల్, వరి పొట్టుతో రూపొందించిన ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారంతో స్వామివారి దర్శనం ముగిసింది. ప్రస్తుతం, ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అధికారులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
Go Back to Shorts
Revanth Reddy
Khairatabad Ganesh
Ganesh Nimajjanam
Telangana
Hyderabad
Ganesh Utsavalu

More Telugu News