Nara Lokesh: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్... ఏపీ అభివృద్ధిపై కీలక చర్చ

Nara Lokesh Meets PM Modi Discusses AP Development
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు హస్తినలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అండగా నిలవాలని లోకేశ్ ప్రధానిని కోరారు.

ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు చేయూత ఇవ్వాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్‌ను మంజూరు చేసినందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విద్యా రంగంలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి ప్రధానికి వివరించిన లోకేశ్, ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు.

గడిచిన 15 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'వికసిత్ భారత్ - 2047' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది మందికి మేలు చేకూర్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలను కూడా ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం.

మంత్రి లోకేశ్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీ ముగింపులో, 'యోగాంధ్ర' నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను లోకేశ్ ప్రధానికి బహుమతిగా అందజేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Narendra Modi
AP development
central government support
investments
IT sector
electronics industry
education reforms
Visakhapatnam

More Telugu News