వేలంపాటలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న టీడీపీ ఎంపీ శబరి

  • కర్నూలులో అట్టహాసంగా గణేశ్ నిమజ్జనోత్సవం
  • రూ. 6.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ఎంపీ బైరెడ్డి శబరి
  • నగరంలో ప్రారంభమైన వినాయక శోభాయాత్ర
కర్నూలులో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాట అందరి దృష్టిని ఆకర్షించింది. కర్నూలు పాతబస్తీలోని రాంబొట్ల ఆలయం వద్ద నిర్వహించిన వేలంలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో ఆమె ఏకంగా రూ. 6.01 లక్షల భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

మరోవైపు, కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవ శోభ నెలకొంది. ఇప్పటికే నగర వీధుల్లో గణనాథుని శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి విగ్రహాల నిమజ్జనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం వినాయక ఘాట్‌లో 7 క్రేన్లు, స్టాంటన్‌పురంలో మరో 2 క్రేన్లను అధికారులు సిద్ధం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా నగరంలోని పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ముఖ్యంగా రాజ్‌విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లించారు. అలాగే, కలెక్టరేట్, సీ క్యాంప్ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News