Gourav Veer Sohal: పంజాబ్ యూనివర్సిటీలో ఏబీవీపీ చారిత్రక విజయం.. 48 ఏళ్లలో తొలిసారి!

Gourav Veer Sohal wins Punjab University Student Union Election
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (పీయూసీఎస్సీ) ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవిని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఏబీవీపీ అభ్యర్థి గౌరవ్ వీర్ సోహల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ (యూఐఎల్ఎస్)లో రీసెర్చ్ స్కాలర్ అయిన గౌరవ్ వీర్ సోహల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 3,148 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి సుమిత్ శర్మపై 488 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. 1977లో పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘానికి ప్రత్యక్ష ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి ఏబీవీపీ అధ్యక్ష పదవిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

ఈ విజయంపై గౌరవ్ వీర్ సోహల్ స్పందిస్తూ, "పంజాబ్‌లో వరదల కారణంగా నష్టపోయిన ప్రజల గురించి ఆలోచిస్తున్నాను" అని మీడియాతో అన్నారు. ఏబీవీపీ సాధించిన ఈ చారిత్రక గెలుపు పట్ల పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ హర్షం వ్యక్తం చేశారు. "48 ఏళ్లలో తొలిసారి పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకుని ఏబీవీపీ చరిత్ర సృష్టించింది. ఈ గొప్ప విజయానికి గాను గౌరవ్ వీర్ సోహల్‌కు, ఏబీవీపీ బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని ఆయన "ఎక్స్" వేదికగా పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా ఈ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థి సంఘాలదే ఆధిపత్యం కాగా, గత దశాబ్ద కాలంగా జాతీయ స్థాయి విద్యార్థి సంఘాల ప్రభావం పెరుగుతూ వస్తోంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఆసాప్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఎస్‌ఓఐ నిరాశపరిచాయి. 2022లో ఆప్ విద్యార్థి విభాగం గెలవగా, గత ఏడాది ఎన్‌ఎస్‌యూఐ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
Go Back to Shorts
Gourav Veer Sohal
Punjab University
ABVP
Student Union Election
Akhil Bharatiya Vidyarthi Parishad

More Telugu News