టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై మరో కేసు నమోదు

  • కోకాపేట విల్లాలో దాడి చేయించారని లావణ్య అనే మహిళ ఫిర్యాదు
  • అనుచరులతో కొట్టించి, నగలు ఎత్తుకెళ్లారని ఆరోపణ
  • పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఫిర్యాదులో వెల్లడి
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ తనపై దాడి చేయించి, దోపిడీకి పాల్పడ్డారంటూ లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఐదుగురి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. కోకాపేటలోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటుండగా రాజ్ తరుణ్ పంపిన కొందరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. మూడు వేర్వేరు సందర్భాల్లో తనను దుర్భాషలాడుతూ, బెల్టులు, గాజు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారని లావణ్య తెలిపింది. ఈ దాడిలో తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా లాక్కెళ్లారని, తన పెంపుడు కుక్కలను సైతం చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వివాదం వెనుక కోకాపేట విల్లాకు సంబంధించిన గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. 2016లో తాను, రాజ్ తరుణ్ కలిసి ఈ విల్లాను కొనుగోలు చేశామని, అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ ఏడాది మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడని లావణ్య వివరించింది. ఈ విల్లా యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఆమె పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News

Raj Tarun Raj Tarun case Lavanya Kokapet villa Narsingi police Tollywood actor property dispute attack allegation Manikantha Thambadi police investigation