Danam Nagender: కవిత ఆరోపణలను కొట్టిపారేసిన దానం నాగేందర్

Danam Nagender Rejects Kavithas Allegations on Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకూడదని, ఇందులో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్లు, అధికారులను కూడా విచారించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కేవలం నేతలనే బలిపశువులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొందరు అధికారుల ఇళ్లలో వందల కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయని, అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దానం ప్రశ్నించారు. కాళేశ్వరం వ్యవహారంలో సమగ్రమైన, లోతైన విచారణ జరగాలని, అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అది కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, తన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై కూడా దానం స్పందించారు. ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 
Go Back to Shorts
Danam Nagender
Kaleshwaram project
Kavitha Kalvakuntla
Revanth Reddy
Telangana politics
Corruption investigation
Harish Rao
Kaleshwaram commission report
Telangana government
Political allegations

More Telugu News