E20 Petrol: E20 పెట్రోల్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. ఆ పిటిషన్‌ కొట్టివేత!

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో 2025-26 నాటికి దేశంలో E20 పెట్రోల్ వాడకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంధన సామర్థ్యం (మైలేజీ) 6 శాతం వరకు తగ్గుతుందని నీతి ఆయోగ్ 2021 నివేదికలో పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది షాదాన్ ఫరాసత్ కోర్టు దృష్టికి తెచ్చారు. తాము E20 విధానాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పిటిషనర్ వాదనలను వ్యతిరేకించారు. ఈ పిటిషన్ వెనుక ఒక 'పెద్ద లాబీ' ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇథనాల్ మిశ్రమం వల్ల చెరకు రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని, ముడి చమురు దిగుమతులు తగ్గి దేశ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆయన స్పష్టం చేశారు. "భారత్ ఎలాంటి ఇంధనాన్ని వాడాలో విదేశాల్లోని వ్యక్తులు నిర్దేశిస్తారా?" అని ఆయన ధర్మాసనాన్ని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది.

E20 పెట్రోల్ వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, వాహనాల యాక్సిలరేషన్, రైడ్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతంలోనే తెలిపింది. పెట్రోల్‌తో పోలిస్తే, చెరకు ఆధారిత ఇథనాల్ వాడకం వల్ల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 65 శాతం వరకు తగ్గుతాయని ప్రభుత్వ అధ్యయనాలు చెబుతున్నాయి.
E20 Petrol
Supreme Court
Ethanol
BR Gavai
R Venkataramani
NITI Aayog
Petrol
Ethanol blending

More Telugu News