Telangana Medical Admissions: తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో నాలుగేళ్లపాటు చదివిన వారికే స్థానిక హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో సరైనదేనని స్పష్టం చేస్తూ, దీనిపై భిన్నాభిప్రాయంతో ఉన్న తెలంగాణ హైకోర్టు తీర్పులను పక్కన పెట్టింది.

వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు తప్పనిసరిగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడే చదివి ఉండాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి.

హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన సరైనదేనని అభిప్రాయపడింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ, ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ ఈరోజు తుది తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై నెలకొన్న వివాదానికి తెరపడినట్లయింది.  
Telangana Medical Admissions
Telangana
Medical Admissions
Supreme Court Verdict
MBBS Admissions
Local Candidate Rule
Justice BR Gavai
High Court
Education Policy

More Telugu News