పక్కనే ఉన్నా పట్టించుకోలేదు.. ఎస్సీఓ సదస్సులో పాక్ ప్రధానికి షాక్
- ఎస్సీఓ సదస్సులో పాక్ ప్రధానికి ఇబ్బందికర పరిణామం
- మోదీ, పుతిన్ మాట్లాడుకుంటూ ముందుకు.. ఒంటరిగా షెహబాజ్ షరీఫ్
- గ్రూప్ ఫొటోకు ముందు చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన
- చైనా, రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ ఆత్మీయ సంభాషణ
టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సులో సభ్యదేశాల అధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు ఒక చోటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ ఏదో విషయంపై తీవ్రంగా చర్చిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో పక్కనే నిల్చున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వారిని చూస్తూ ఉండిపోయారు. ఇద్దరు అగ్రనేతలు తనను పలకరించకుండా వెళ్లడంతో ఆయన ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురు నేతలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ ఫొటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్సీఓ సదస్సులో పాక్ ప్రధానిని మోదీ, పుతిన్ పలకరించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.