నాకు వయసు మీద పడుతోంది.. ఆ సమస్యకు ముగింపు పలకండి: జపాన్ లో ఉన్న మోదీకి సుభాష్ చంద్రబోస్ కుమార్తె విన్నపం

  • నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ప్రధానికి అనితా బోస్ విజ్ఞప్తి
  • మోదీ జపాన్ పర్యటన నేపథ్యంలో అనితా బోస్ అభ్యర్థన
  • జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలు ఉన్నాయని విశ్వాసం
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆమె ఈ అభ్యర్థన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన వయసు మీద పడుతున్నందున, ఈ సమస్యకు త్వరగా ఒక ముగింపు పలకాలని ఆమె విన్నవించారు.

ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్ ఈరోజు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తే, తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని కచ్చితంగా కోరతానని ఆమె స్పష్టం చేశారు. "గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం నా తండ్రి అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొనసాగించాలి. నా వయసు రీత్యా ఈ విషయం నాకు మరింత అత్యవసరంగా మారింది" అని ఆమె భావోద్వేగంగా అన్నారు.

"ఈ సమస్యకు ఒక ముగింపు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ బాధ్యతను నా కొడుక్కి వారసత్వంగా ఇవ్వాలని నేను అనుకోవడం లేదు" అని అనితా బోస్ చెప్పారు. ఇది కేవలం తన వ్యక్తిగత విషయం కాదని, తన తండ్రి యావత్ దేశానికి చెందిన వ్యక్తి అని ఆమె గుర్తుచేశారు.

1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ విచారణలు నిర్ధారించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, అక్కడి సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని నివేదికలు తెలిపాయి. ఆయన అస్థికలను జపాన్‌లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలోని ఒక కలశంలో భద్రపరిచినట్లు బలంగా విశ్వసిస్తున్నారు.


More Telugu News