Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్.. ఇండియా టుడే సర్వేలో స్పష్టమైన ఆధిక్యం!

Rahul Gandhi Leads India Today Survey as Opposition Choice
షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే అత్యంత సమర్థుడని తాజా సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో అత్యధిక మంది ప్రజలు రాహుల్ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్షాలను సమర్థంగా నడిపించగల నేత ఎవరనే ప్రశ్నకు, సర్వేలో పాల్గొన్న వారిలో 28.2 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు.

ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ 7.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7 శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (6.4శాతం), కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (4.4 శాతం) వరుస స్థానాల్లో ఉన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే రాహుల్ గాంధీ ఆదరణ పెరగడం గమనార్హం. అప్పుడు ఆయనకు 23.9 శాతం మద్దతు లభించగా, ఇప్పుడు అది 28.2 శాతానికి చేరింది. అయితే, గత ఏడాది ఆగస్టులో వచ్చిన 32.3 శాతంతో పోలిస్తే ఇది కొంత తక్కువే.

ప్రతిపక్ష నేతగా పనితీరు మెరుగుదల
లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన పనితీరు 'అద్భుతంగా' ఉందని చెప్పిన వారి సంఖ్య ఫిబ్రవరిలో 25 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ఆయన పనితీరు 'బాగాలేదు' (పూర్) అని చెప్పిన వారి సంఖ్య 27 శాతం నుంచి 15 శాతానికి గణనీయంగా తగ్గింది. మరో 22 శాతం మంది 'బాగుంది' అని, 16 శాతం మంది 'సాధారణం' అని అభిప్రాయపడ్డారు.

ఇండియా టుడే-సీఓటర్ ఈ సర్వేను 2025, జులై 1 నుంచి ఆగస్టు 14 మధ్య దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించింది. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది.
Go Back to Shorts
Rahul Gandhi
India Today Survey
Opposition Leader
Mood of the Nation
Congress
Mamata Banerjee
Akhilesh Yadav
Arvind Kejriwal
Priyanka Gandhi

More Telugu News