Himachal Pradesh Floods: హిమాచల్‌లో జల ప్రళయం.. 50 కి.మీ. ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించడంతో జనజీవనం స్తంభించింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-కులు జాతీయ రహదారిపై సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా ఢిల్లీకి వెళ్లాల్సిన కోట్ల రూపాయల విలువైన పండ్లు, కూరగాయలతో ఉన్న వందలాది ట్రక్కులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయాయి.

లారీల్లోని యాపిల్స్, టమోటాలు వంటి సరుకులు కుళ్లిపోతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కులో సుమారు రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల విలువైన సరుకు ఉందని, మొత్తం మీద రూ.50 కోట్లకు పైగా విలువైన యాపిల్స్ రవాణాలో నిలిచిపోయాయని అంచనా. తన యాపిల్ లోడుతో సాహిబాబాద్ పండ్ల మార్కెట్‌కు వెళ్లాల్సి ఉండగా ఐదు రోజులుగా కులులోనే చిక్కుకుపోయానని గఫార్ అనే ట్రక్ డ్రైవర్ తెలిపారు. ఆజాద్‌పూర్, సాహిబాబాద్ మార్కెట్లకు వెళ్లే వేలాది ట్రక్కులు ఇలాగే చిక్కుకున్నాయని ఆయన వివరించారు.

మండీ-కులు మధ్య దాదాపు అర డజను ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల హైవే చాలా చోట్ల దెబ్బతిన్నదని, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇంజనీర్ అశోక్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతానికి చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తుండగా భారీ వాహనాలు మాత్రం రోజుల తరబడి నిలిచిపోయాయి.

ఈ విపత్తు వల్ల మనాలికి ఒకవైపు నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని మనాలి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ రామన్ శర్మ పేర్కొన్నారు. కులులోని రామ్‌శిలా సమీపంలో ఇళ్లు దెబ్బతిన్నాయని, అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం నాశనమయ్యే ప్రమాదం ఉందని జై భల్ అనే స్థానికుడు ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం నుంచి ఇప్పటివరకు నాలుగు దుకాణాలు, రెండు రెస్టారెంట్లు, ఒక ఇల్లు ధ్వంసమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మండీ, కులు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Himachal Pradesh Floods
Himachal Pradesh
Kullu
Manali
Chandigarh Kullu National Highway

More Telugu News