Rajnath Singh: వాళ్లకు గాల్లో ఎగిరే ఎఫ్-35 ఉంటే... మనకు నీటిపై తేలే ఎఫ్-35 ఉంది: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh Compares New Indian Warships to F35 Jets
షార్ట్స్‌లో చూడండి
"అమెరికాకు గగనతలంలో దూసుకెళ్లే ఎఫ్-35 ఫైటర్ జెట్లు ఉంటే, మనకు నీటిపై తేలియాడే ఎఫ్-35 యుద్ధనౌకలు ఉన్నాయి" అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తూర్పు నౌకాదళ కమాండ్ వేదికగా భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో రెండు శక్తిమంతమైన యుద్ధనౌకలు చేరాయి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి పేరుతో నిర్మించిన ఈ మల్టీ-మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లను ఆయన జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో ఒక తేలియాడే ఎఫ్-35ను నిర్మించిందని ప్రశంసించారు. అమెరికాకు చెందిన ఎఫ్-35 జెట్లు వాటి వేగానికి, శత్రువుల రాడార్లకు చిక్కని స్టెల్త్ సామర్థ్యానికి ప్రసిద్ధి అని గుర్తుచేశారు. మన యుద్ధనౌకలు కూడా అలాంటి అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లతో కూడిన ఈ నౌకలు మన సముద్రాలకు అజేయ రక్షకులుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన ఈ నౌకల్లో సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, సూపర్‌సోనిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు, టార్పెడోలు, ఫైర్-కంట్రోల్ వ్యవస్థలు వంటివి ఉన్నాయని రాజ్‌నాథ్ వివరించారు. ప్రాజెక్ట్ 17ఏ కింద ఈ నౌకలను అభివృద్ధి చేశారు. వీటిలో ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (ఎండీఎల్), ఐఎన్ఎస్ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) నిర్మించాయి. గతంలో 30 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించిన పాతతరం యుద్ధనౌకల పేర్లనే వీటికి పెట్టడం విశేషం.

ఈ రెండు నౌకల రాకతో భారత నౌకాదళం 'బ్లూ వాటర్ నేవీ'గా మరింత బలోపేతమైందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని ఆయన బలగాలకు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Rajnath Singh
INS Udaygiri
INS Himagiri
Indian Navy
F-35 fighter jet
Project 17A
Naval Command
Stealth Frigates
Mazagon Dock Shipbuilders
Garden Reach Shipbuilders

More Telugu News