YS Sharmila: కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదు: షర్మిల

YS Sharmila slams coalition government on disabled pensions
షార్ట్స్‌లో చూడండి
దివ్యాంగుల పెన్షన్ల రీ-వెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. అనర్హులను ఏరివేసే నెపంతో, అర్హులైన దివ్యాంగుల పింఛన్లను సైతం తొలగించి వారి పొట్టకొట్టాలని చూడటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల మానవత్వంలేదంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ, "బోగస్ పెన్షన్లను గుర్తించి, దొంగ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారిని ఏరివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అలాంటి సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఆ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. రీ-వెరిఫికేషన్ పేరుతో ఏళ్ల తరబడి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న నిజమైన వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు" అని అన్నారు.

ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన 1.20 లక్షల మందిలో అత్యధికులు అర్హులే ఉన్నారని తమకు సమాచారం అందిందని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన అనర్హుల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. "వికలాంగుల జీవితాలతో రాజకీయాలు చేయడం తగదు. ప్రభుత్వం వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది" అని ఆమె హితవు పలికారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని షర్మిల కోరారు. అర్హులుగా తేలిన వారి పెన్షన్లను వెంటనే పునరుద్ధరించి, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె డిమాండ్ చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Andhra Pradesh Congress Committee
disabled pensions
disability pension verification
Chandrababu Naidu
Andhra Pradesh government
pension re verification
divyang pension
AP politics
pension scheme

More Telugu News