అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ప్రధాని 
  • అహ్మదాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ 
  • దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసిందన్న మోదీ
దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భారత్‌పై అమెరికా విధించిన అదనపు దిగుమతి సుంకాలను అమలు చేసే గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.  

గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, "ఈ విషయంలో ఒత్తిడి పెరగొచ్చు. కానీ దేశ ప్రయోజనాల కోసం ఆ ఒత్తిడిని భరిస్తాం. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్‌ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసింది. కానీ మనం స్వదేశీ మార్గంలో ముందుకెళ్తున్నాం" అని అన్నారు.

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 25 శాతం అదనంగా విధించనున్నట్లు ప్రకటించారు. ఇవి ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల మాట్లాడుతూ, ఈ గడువును పొడిగించే అవకాశం లేదని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే ఈ అదనపు సుంకాలను 'అన్యాయమైనవి, అనుచితమైనవి'గా పేర్కొంటూ ఖండించింది.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వదేశీ భావనను గుర్తు చేస్తూ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మరియు మహాత్మా గాంధీ చరఖా ఉద్యమాన్ని ఉదహరించారు. అంతేకాదు, దేశ శౌర్యాన్ని చాటిచెప్పిన 'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావించారు. 


More Telugu News