నేటి నుంచి ఢిల్లీలో ఆలిండియా స్పీకర్స్‌ కాన్ఫరెన్స్‌

  • నేడు ఢిల్లీ అసెంబ్లీ భవనంలో సదస్సును ప్రారంభించ‌నున్న‌ మంత్రి అమిత్‌ షా
  • ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 
  • నిన్న ఢిల్లీ చేరుకున్న తెలుగు రాష్ట్రాల స్పీకర్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు, రేపు ఆలిండియా స్పీకర్ల‌ కాన్ఫరెన్స్‌ జరగనుంది. ఇవాళ‌ అక్కడి అసెంబ్లీ భవనంలో సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించనున్నారు. ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు వెళ్లారు. 

ఇటు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెళ్ల‌గా.. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కంటి శస్త్ర చికిత్స జరిగినందున ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. 

1925లో భారతదేశ సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్‌బాయి పటేల్‌ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రెండు రోజుల స‌ద‌స్సులో దేశవ్యాప్తంగా అసెంబ్లీల స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, మండలి ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు పాల్గొంటారు. 


More Telugu News