అమెరికా-పాకిస్థాన్ దోస్తీపై జైశంకర్ ఏమన్నారంటే...!

  • అమెరికా, పాక్ మధ్య ఇటీవల పెరుగుతున్న స్నేహం
  • ఆ రెండు దేశాలకు పరస్పర చరిత్ర ఉందన్న జైశంకర్ 
  • గతాన్ని మర్చిపోయే చరిత్ర కూడా వారిదేనని చురకలు
భారత్‌తో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సమయంలో అమెరికా, పాకిస్థాన్‌ మధ్య స్నేహం ఇటీవల పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగిన ‘వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం’ సదస్సులో మాట్లాడుతూ, అమెరికా-పాకిస్థాన్‌లకు ఒక చరిత్ర ఉందని, గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదేనని అన్నారు. ఈ సందర్భంగా ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా సైన్యం పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చిన ఘటనను గుర్తుచేశారు.

“ఈ రెండు దేశాలకు పరస్పర చరిత్ర ఉంది. అంతేకాదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా గతాన్ని మర్చిపోగలిగిన చరిత్ర కూడా వారిదే. అమెరికా సైన్యం అబోటాబాద్‌లో ఎవర్ని గుర్తించిందో అందరికీ తెలుసు” అని జైశంకర్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 11 దాడులకు సూత్రధారి అయిన బిన్‌ లాడెన్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

అనేక దేశాల సైన్యాలు ఏ విధంగా పనిచేస్తాయనే దానిపై మాట్లాడుతూ, కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలపై దృష్టి పెడతాయని, వ్యూహాత్మక లేదా ఇతర ప్రయోజనాల కోసం అలాంటి చర్యలకు పాల్పడతాయని జైశంకర్‌ అన్నారు. అమెరికాతో భారత్‌కు ఉన్న బలమైన సంబంధాలను, ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌ ముందుకు సాగుతుందని తెలిపారు.

మరోవైపు, పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల పశ్చిమ దేశాల కోసం మూడు దశాబ్దాల పాటు ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు అంగీకరించారు. ఈ చర్యల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అది పొరపాటని తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల పాక్‌ సైన్యాధికారి వాషింగ్టన్‌లో రెండుసార్లు పర్యటించడం, ట్రంప్‌ యంత్రాంగం పాక్‌పై సానుకూల ధోరణి చూపడం ఈ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది.


More Telugu News