భారత్‌లో టిక్ టాక్ రీ ఎంట్రీ..? సోషల్ మీడియా ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత

  • టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేశారన్న వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం
  • ఇవన్నీ కేవలం సోషల్ మీడియా వదంతులేనని స్పష్టీకరణ
  • షేన్, అలీఎక్స్‌ప్రెస్ యాప్‌లపై కూడా నిషేధం కొనసాగింపు
  • 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత టిక్‌టాక్‌ తో పాటు 59 చైనా యాప్‌లపై వేటు
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టిక్‌టాక్‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్ వేదికలైన షేన్, అలీఎక్స్‌ప్రెస్‌లపై కూడా నిషేధం కొనసాగుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. ఈ యాప్‌లు మళ్లీ దేశంలోకి అందుబాటులోకి వస్తున్నాయన్న వార్తలను కొట్టిపారేసింది.

గత కొద్ది రోజులుగా, కొందరు యూజర్లు తమ ఫోన్లలో టిక్‌టాక్ వెబ్‌సైట్ హోమ్‌పేజీని యాక్సెస్ చేయగలుగుతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఐదేళ్ల తర్వాత టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి వస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, వెబ్‌సైట్ ఓపెన్ అవుతున్నప్పటికీ, వీడియోలు చూసేందుకు లేదా ఇతర ఫీచర్లను వాడేందుకు అవకాశం లేదని చాలామంది తెలిపారు. ఈ ప్రచారంపై స్పందించిన ప్రభుత్వం, ఆ యాప్‌లపై నిషేధం యథాతథంగా కొనసాగుతోందని స్పష్టత ఇచ్చింది.

2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, జాతీయ భద్రత, పౌరుల సమాచార గోప్యతకు ముప్పు ఉందన్న కారణాలతో కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను జూన్ 29, 2020న నిషేధించింది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్, యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందని ప్రభుత్వం ఆరోపించింది.

అయితే, అప్పట్లో నిషేధానికి గురైన యాప్‌లలో కొన్ని ఇప్పటికే మార్పులు చేసుకొని లేదా క్లోన్ వెర్షన్ల రూపంలో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. జెండర్, టాన్‌టాన్ వంటి పలు యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ, టిక్‌టాక్‌పై మాత్రం నిషేధం కఠినంగా అమలవుతోంది. తాజా వదంతుల నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.


More Telugu News