Neha Solanki: మధ్యప్రదేశ్‌లో దారుణం.. 45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన కన్నతల్లి

Neha Solanki Kills 45 Day Old Baby in Madhya Pradesh
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన
  • డిప్రెషన్ కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • నేరాన్ని అంగీకరించిన నిందితురాలు, అరెస్ట్ చేసిన పోలీసులు
  • గతంలోనూ బిడ్డను చంపేందుకు యత్నించినట్లు బంధువుల వెల్లడి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారింది. నెలన్నర పసికందును అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. నిందితురాలు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఇండోర్‌లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిర్‌ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి, నేహా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 45 రోజుల కుమారుడు ప్రియాంశ్ ఉన్నాడు. గురువారం ఇంట్లో ఉన్న నేహా, పదునైన ఆయుధంతో పసికందు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా, బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి, బాబుకు ఏదో అయిందంటూ కేకలు వేసింది.

ఆడపడుచు ఇంట్లోకి వచ్చి చూడగా, ప్రియాంశ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తల్లి నేహా చేతులపై రక్తపు మరకలను గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది.

"ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తల్లి నేహా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చు. నిందితురాలిని అరెస్ట్ చేసి, సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశాం" అని అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నేహా మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని బంధువులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.

More Telugu News

Neha Solanki
Madhya Pradesh crime
infanticide
child murder
Indore crime
depression