కృతి శెట్టికి కోలీవుడ్ కలిసొచ్చేనా?

  • 'ఉప్పెన'తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి 
  • తెలుగులో తగ్గిన అవకాశాలు 
  • కోలీవుడ్ ఛాన్సులతో బిజీ 
  • చేతిలో భారీ ప్రాజెక్టులు  

తెలుగు తెరపై అందమైన కథానాయికలుగా చాలామంది సందడి చేశారు. అయితే టీనేజ్ లోనే తెరపైకి వచ్చి .. మొదటిలో సినిమాతోనే ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ చాలా తక్కువనే చెప్పాలి.  అలాంటి అతికొద్ది మంది హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరనే విషయాన్ని ఒప్పుకోవాలి. 'ఉప్పెన' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, కుర్రకారు మనసులలో మరో హీరోయిన్ లేకుండా చెరిపేసింది. ఈ మధ్య కాలంలో ఇంతటి అందమైన అమ్మాయి తారసపడలేదనే అంతా అనుకున్నారు. 

'ఉప్పెన' సినిమా చూసిన టీనేజ్ కుర్రాళ్లంతా కృతి శెట్టి అభిమానుల జాబితాలో చేరిపోయారు. ఆమె ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అందుకు తగినట్టుగానే మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అయితే ఆ తరువాతనే పరాజయాల పరంపర మొదలైంది. పెద్ద బ్యానర్లు .. క్రేజ్ ఉన్న హీరోలు .. అంతో ఇంతో కంటెంట్ ఉన్న సినిమాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.  సక్సెస్ లేని చోట అవకాశాలు అడుగుపెట్టబోమనడం సహజమే కదా. 

తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా ఆమె కోలీవుడ్ కి తన మకాం మార్చింది. అక్కడ ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. కార్తీ .. రవి మోహన్ .. ప్రదీప్ రంగనాథ్ సరసన ఆమె మెరవనుంది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ తో కూడినవే కావడం విశేషం. ప్రదీప్ రంగనాథ్ జోడీగా చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' వచ్చేనెల 18న విడుదల కానుంది. ఈ మూడు సినిమాలలో ఏ రెండు హిట్ కొట్టినా కృతి మరింత స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.



More Telugu News