Delhi Schools: ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు

Multiple Delhi schools receive bomb threat emails search operations underway
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పలు పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులతో కూడిన ఈమెయిళ్లు అందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇవాళ‌ ఉదయం 7:40 గంటల సమయంలో మాలవీయ నగర్‌లోని ఎస్‌కేవీ పాఠశాలకు, 7:42 గంటలకు ప్రసాద్ నగర్‌లోని ఆంధ్ర స్కూల్‌కు బాంబు హెచ్చరికలతో ఈమెయిళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పాఠశాల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇది కొత్తేమీ కాదు. కేవలం రెండు రోజుల క్రితం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు (డీపీఎస్) ఇలాగే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్పుడు కూడా అధికారులు తనిఖీలు చేయగా, అది బూటకపు బెదిరింపు అని తేలింది. గత నెలలో అయితే ఏకంగా 50కి పైగా పాఠశాలలకు ఒకేసారి ఈమెయిళ్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో చాలా స్కూళ్లు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయి.

వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ బెదిరింపు ఈమెయిళ్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని వారు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Delhi Schools
Delhi school bomb threat
bomb threat
Delhi Police
cyber crime
school safety
Andhra School
Delhi Public School
SKV school

More Telugu News