మా అత్త గారి తర్వాత ఆవిడే మా కుటుంబ పెద్ద: సీఎం చంద్రబాబు

  • నందమూరి కుటుంబంలో విషాదం
  • ఎన్టీఆర్ పెద్ద కోడలు పద్మజ కన్నుమూత  
  • పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
నందమూరి కుటుంబంలో విషాదం నెలకొనడం తెలిసిందే. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ అర్ధాంగి పద్మజ నేడు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పద్మజ వయసు 73 సంవత్సరాలు. ఆమె స్వయానా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. కాగా, హైదరాబాదులో నందమూరి పద్మజ భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. పద్మజ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ అత్త గారి తర్వాత పద్మజే కుటుంబ పెద్దగా ఉండేవారని తెలిపారు. తన పెళ్లి సమయంలోనూ పద్మజ-జయకృష్ణ దంపతులు అన్ని విషయాలు పర్యవేక్షించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పద్మజ గారి మృతి ముఖ్యంగా జయకృష్ణ గారికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. 

గతంలో తాను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జయకృష్ణ ఎగ్జిబిటర్ గా ఉండేవారని చంద్రబాబు వెల్లడించారు. ఎగ్జిబిటర్ గా ఆయన తనవద్దకు వస్తూపోతూ ఉండేవారని, ఆయన ద్వారానే తనకు ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయం ఏర్పడిందని వివరించారు. ఇక, పద్మజ కూడా అందరితో కలిసిపోయేవారని, ఆమె మృతి ఎంతో వేదన కలిగిస్తోందని అన్నారు. 


More Telugu News