దూకుడు కొనసాగించిన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market Indices Continue Bull Run
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగించాయి. వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా కీలక సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. జీఎస్టీ హేతుబద్ధీకరణ ఉంటుందన్న సానుకూల అంచనాలు మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా తోడవడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 81,644.39 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 103.70 పాయింట్లు పెరిగి 24,980.65 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 81,39.11 వద్ద గ్యాప్-అప్‌తో ప్రారంభమై, రోజంతా సానుకూలంగానే కదలాడింది. ఒక దశలో 81,755.88 వద్ద ఇంట్రా-డే గరిష్ఠాన్ని కూడా తాకింది.

జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై పెరుగుతున్న అంచనాలు, ఇటీవల భారత్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చిందని ఆయన విశ్లేషించారు.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కూడా కొనుగోళ్ల మద్దతు కనిపించింది. సెన్సెక్స్-30 షేర్లలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, మారుతీ, ఐటీసీ అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభపడ్డాయి.


Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
GST
Indian Stock Market
Share Market
Vinod Nair
Auto Stocks
FMCG

More Telugu News