నందమూరి కుటుంబంలో విషాదం.. స్పందించిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

  • ఎన్టీఆర్ త‌న‌యుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత
  • హైదరాబాద్‌ ఫిలింనగర్‌ నివాసంలో తుది శ్వాస
  • 'ఎక్స్' వేదిక‌గా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌  
నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీఆర్‌ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మ‌ర‌ణించారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

కాగా, పద్మజ మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌మ కుటుంబంలో విషాదం నింపింద‌ని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. 

"బావ‌మ‌రిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మ‌ర‌ణించార‌ని తెలిసి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. ఈ ఘ‌ట‌న మా కుటుంబంలో విషాదం నింపింది. ప‌ద్మ‌జ ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

"మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి, పద్మజ అత్త కన్ను మూశారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబానికి అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను" అంటూ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు.


More Telugu News