Chandrababu Naidu: వాయుగుండం హెచ్చరిక... అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్‌తో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను సీఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లను తక్షణమే అప్రమత్తం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

భారీ వర్షాల వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. "ప్రజలకు సమాచారం అందించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో వెంటనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి అన్నారు. వర్షాల తీవ్రత పెరిగితే విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని కూడా ఆయన సూచించారు. ముందస్తు సన్నద్ధత, అప్రమత్తతే మనల్ని కాపాడతాయని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Cyclone alert
Heavy rains
North Andhra
Weather warning
Government review
CM review meeting
Control room
Disaster management

More Telugu News