బాలీవుడ్ సినిమా సెట్స్ పై ఫుడ్ పాయిజనింగ్.... 100 మంది ఆసుపత్రి పాలు

  • లడఖ్‌లో బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో అపశ్రుతి
  • ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మందికి పైగా సిబ్బందికి అస్వస్థత
  • బాధితులను హుటాహుటిన లేహ్‌లోని ఆసుపత్రికి తరలింపు
  • దాదాపు 600 మంది భోజనం చేసినట్టు వెల్లడి
  • ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
  • ఆహార నమూనాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న అధికారులు
అందమైన లడఖ్ ప్రాంతంలో జరుగుతున్న ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏకంగా 100 మందికి పైగా సినిమా యూనిట్ సభ్యులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, లడఖ్‌లోని లేహ్‌లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యులందరూ భోజనం చేశారు. కొద్దిసేపటికే వారిలో చాలామందికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో యూనిట్‌లో ఆందోళన నెలకొంది. వెంటనే అస్వస్థతకు గురైన వంద మందికి పైగా సిబ్బందిని లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

బాధితులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఆసుపత్రికి రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల వైద్యులను వెంటనే రంగంలోకి దించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించేందుకు, ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు కూడా సహాయం అందించారు.

ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలామందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 600 మంది భోజనం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.

అయితే, ఈ ఘటన ఏ సినిమా షూటింగ్‌లో జరిగింది, దర్శకుడు, నిర్మాత ఎవరు, నటీనటుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘3 ఇడియట్స్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్‌కు లడఖ్ సుపరిచితమైన లొకేషన్‌గా మారింది. 


More Telugu News