కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక దారుణ హత్య

  • సంగీత్‌నగర్‌లో దారుణ ఘటన
  • సెలవు కావడంతో ఇంట్లోనే ఉండిపోయిన కుమార్తె
  • తండ్రి వచ్చేసరికి కత్తిపోట్లతో విగతజీవిగా పడి ఉన్న కుమార్తె
హైదరాబాద్ నగరంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సంగీత్ నగర్‌లో నివసిస్తున్న దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త బైక్ మెకానిక్‌గా, భార్య ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు.

కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు కుమారుడిని పాఠశాలకు పంపించి, అనంతరం వారి విధులకు హాజరయ్యారు. కుమార్తెకు పాఠశాలకు సెలవు కావడంతో ఆమె ఇంట్లోనే ఉంది.

మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, కుమారుడికి భోజనం తీసుకెళ్లడానికి తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే, బెడ్రూమ్‌‍‌లో బాలిక కత్తి పోట్లతో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. గుర్తు తెలియని దుండగులు బాలికను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లతో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News