సాక్షి, సుమన్ టీవీల్లో తప్పుడు ప్రసారాలు .. ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదుతో కేసుల నమోదు

  • తాడేపల్లి, విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సాక్షి ఛానల్‌పై కేసు నమోదు
  • అమరావతిని లేపేందుకు ప్రభుత్వం పొన్నూరును ముంచేసిందంటూ సాక్షిలో కథనం
  • సుమన్ టీవీపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • విరిగిపోయిన ప్రకాశం బ్యారేజీ 67వ గేట్... అంటూ సుమన్ టీవీలో కథనం 
అమరావతిపై దుష్ప్రచారం చేసేందుకు తప్పుడు కథనాలు, నిరాధార సమాచారాన్ని ప్రసారం చేసిన కేసుల్లో సాక్షి టీవీ, సుమన్ టీవీ ఛానళ్లపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తాడేపల్లి మరియు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్లలో నిన్న ఈ కేసులు నమోదయ్యాయి.

‘అమరావతిని లేపటానికి పొన్నూరును ముంచేశారు’ - సాక్షిపై అభియోగాలు:

సాక్షి టీవీలో ఆగస్టు 16న ప్రసారమైన కథనంలో, "అమరావతిని లేపేందుకు ప్రభుత్వం పొన్నూరును ముంచేసింది" అంటూ పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ చేసిన ఆరోపణలను ఆధారంగా కథనాన్ని ప్రసారం చేయడం, వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరిగింది. జలవనరులశాఖ అధికారులు దీనిపై తీవ్రంగా స్పందించి, "కొండవీటి వాగు వరద నీటిని గుంటూరు ఛానల్‌లోకి వదల్లేదు. భారీ వర్షాల వల్ల డ్రెయిన్లలోని నీళ్లే పొలాల్లోకి చేరాయి" అని స్పష్టం చేశారు. గుంటూరు ఛానల్ ఏఈఈ అవినాష్ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది.

ప్రకాశం బ్యారేజీపై తప్పుడు ప్రచారం – సుమన్ టీవీపై కేసు:

ఆగస్టు 15న సుమన్ టీవీ ఫేస్‌బుక్ పేజీలో "విరిగిపోయిన ప్రకాశం బ్యారేజీ 67వ గేట్... భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉంది" అనే నిరాధారమైన పోస్టును ప్రచురించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. భయాందోళనలు కలిగించేలా ఈ దుష్ప్రచారాన్ని భాస్కరరెడ్డి ఎలియాస్‌ చికాగో బాచీ అనే ఎక్స్ ఖాతా ద్వారా విస్తృతంగా షేర్ చేశారు. వాస్తవానికి, 67వ గేట్ పూర్తిగా సురక్షితంగా ఉందని ప్రకాశం బ్యారేజీ సూపరింటెండెంట్ యూ. సత్య రాజేష్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. 


More Telugu News