కొడుకు తనకు పుట్టలేదన్న అనుమానంతో ఓ తండ్రి ఘాతుకం!

  • రెండేళ్ల కుమారుడికి కన్నతండ్రే పురుగు మందు తాగించి ఆపై మేడపై నుంచి తోసేసి హత్య 
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిటౌవ గ్రామంలో ఘటన 
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
కొడుకు తనకు పుట్టలేదన్న అనుమానంతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని రెండేళ్ల కుమారుడికి పురుగుల మందు తాగించి, ఆపై మేడపై నుంచి తోసేసి హతమార్చాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిటౌవ గ్రామంలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కొడుకునే హత్య చేసిన ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. చిటౌవ గ్రామానికి చెందిన రాజ్ బహదూర్‌కు యమునావతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అంకుశ్, లలిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజ్ తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించేవాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

గతంలో ఒకసారి రాజ్ తన భార్యపై కత్తితో దాడి చేశాడు. మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని రాజ్ అడగగా, ఆమె నిరాకరించడంతో మళ్ళీ గొడవ జరిగింది. దీంతో ఆమె ఆగ్రహంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పుడు రాజ్ తన రెండేళ్ల కుమారుడు లలిత్‌ను తీసుకొని ఇంటి గేటుకు తాళం వేసి మేడపైకి వెళ్ళాడు.

అక్కడ ఉన్న పురుగుల మందును బలవంతంగా బాలుడికి తాగించాడు. అంతేకాకుండా మేడపై నుంచి తన కొడుకును కిందకు తోసేశాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ బెదిరించాడు. చివరికి స్థానికుల సాయంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


More Telugu News