కొడుకు చదువుల కోసం అమెరికాకు కవిత.. ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశం

  • కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడం కోసం అమెరికా వెళుతున్న కవిత
  • కేసీఆర్ ఆశీర్వాదం కోసం కొడుకుతో కలిసి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కవిత
  • అక్కడే భోజనం చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్న కవిత
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కలిశారు. తన చిన్న కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడం కోసం ఆమె అమెరికా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కుమారుడికి తాత ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్‌కు వెళ్లారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు.

తండ్రి ఫామ్ హౌస్‌లో దాదాపు గంట పాటు ఉన్న కవిత, తొలుత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం తల్లితో మాట్లాడారు. కుమారుడి చదువుల కోసం అమెరికా వెళుతున్నట్లు వారికి తెలియజేశారు. ఆర్య తన తాత ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్, కవిత పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చారు.

తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళుతున్న కవిత, అక్కడ 15 రోజులు ఉండనున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని సెప్టెంబర్ 1న ఆమె తిరిగి హైదరాబాద్ రానున్నారు.


More Telugu News