భారతదేశమే టార్గెట్... 'రాకెట్ ఫోర్స్' ఏర్పాటు చేసిన పాకిస్థాన్

Shehbaz Sharif Announces Pakistan Rocket Force Targeting India
  • పాకిస్థాన్‌లో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
  • భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ దళాన్ని స్థాపిస్తున్నట్టు వెల్లడి
  • అధికారికంగా ప్రకటించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • సింధూ జలాల విషయంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు
  • పాక్ ఆర్మీ చీఫ్ నుంచి అణు యుద్ధ బెదిరింపు వ్యాఖ్యలు
  • మోదీకి వ్యతిరేకంగా ఏకం కావాలని బిలావల్ భుట్టో పిలుపు
భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా, ప్రత్యేకంగా ‘రాకెట్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. బుధవారం రాత్రి ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉంది.

అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ దళానికి ప్రత్యేక కమాండ్ ఉంటుందని, యుద్ధ సమయాల్లో క్షిపణుల మోహరింపు, ప్రయోగాన్ని ఇది పర్యవేక్షిస్తుందని పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓ సైనికాధికారి ఒక ఆంగ్ల వార్తా సంస్థతో చెప్పడం గమనార్హం. గతంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి క్షిపణి దాడులను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే, ప్రధాని షెహబాజ్ సింధూ నది జలాల విషయంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సింధూ నది పాకిస్థాన్‌కు జీవనాధారమని, దాని నుంచి ఒక్క చుక్క నీటిని మళ్లించినా భారత్ మరచిపోలేని గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, పాక్ సైన్యాధిపతి అసీం మునీర్, పీపీపీ నేత బిలావల్ భుట్టో సైతం భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మాట్లాడుతూ, భారత్‌ను ఒక మెర్సిడెస్ కారుతో, పాకిస్థాన్‌ను ఒక డంప్ ట్రక్కుతో పోల్చిన మునీర్... రెండూ ఢీకొంటే నష్టం ఎవరికి ఎక్కువని ప్రశ్నించారు. సింధూ నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని, తాము మునిగితే ప్రపంచంలో సగాన్ని తమతో పాటే తీసుకెళతామంటూ పరోక్షంగా అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రజలందరూ ఏకం కావాలని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు. ఈ వరుస పరిణామాలు భారత్-పాక్ సంబంధాలపై ఆందోళన కలిగిస్తున్నాయి.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan
India
Rocket Force
Asim Munir
Bilawal Bhutto
Indus River
Military
Nuclear threat
Sindh River

More Telugu News