Marco Rubio: పాక్‌పై అమెరికా ప్రేమ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Marco Rubio greets Pakistan Independence Day highlights US partnership
  • ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాక్‌ను ప్రశంసించిన అమెరికా విదేశాంగ మంత్రి
  • కొన్ని నెలల క్రితమే పహల్గాంలో 26 మంది పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు
  • బలూచిస్థాన్ ఖనిజాల కోసమే పాక్‌తో అమెరికా మైత్రి అంటున్న‌ విశ్లేషకులు
  • అమెరికా-పాక్ ఒప్పందంపై బలోచ్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా పర్యటనలో నిరసన సెగ
పహల్గాం ఉగ్రదాడి నెత్తుటి మరకలు ఆరకముందే, పాకిస్థాన్‌పై అమెరికా అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన కొన్ని నెలల్లోనే, అదే పాకిస్థాన్‌కి ఇప్పుడు స్నేహహస్తం చాచడం అంతర్జాతీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇస్లామాబాద్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాక్ భాగస్వామ్యాన్ని మెచ్చుకున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా కూడా అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా, మే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ప్రవాస పాకిస్థానీల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. కొందరు నిరసనకారులు ఆయన్ను 'గీదడ్' (నక్క) అని నినాదాలు చేస్తూ అవమానించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇంత జరిగినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణం కనిపిస్తోంది. బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ, హైడ్రోకార్బన్ నిక్షేపాలపై అమెరికా కన్నేసింది. చైనా ఆధిపత్యంలో ఉన్న రేర్ ఎర్త్ మార్కెట్‌కు పోటీగా, తమ సరఫరా గొలుసును బలోపేతం చేసుకోవడంలో భాగంగా పాకిస్థాన్‌తో ఈ ఒప్పందానికి అమెరికా ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. "కీలకమైన ఖనిజాలు, హైడ్రోకార్బన్ల వంటి రంగాల్లో పాకిస్థాన్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం. ఇది ఇరు దేశాల ప్రజల భవిష్యత్తుకు మేలు చేస్తుంది" అని రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, అమెరికా-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఈ సహకారాన్ని బలోచ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్ సైన్యం, గూఢచార సంస్థలు మరింత బలపడతాయని, బలూచిస్థాన్ ప్రజల అణచివేత రెట్టింపు అవుతుందని ప్రముఖ బలోచ్ ఉద్యమకారుడు మీర్ యార్ బలోచ్ హెచ్చరించారు. 

బలూచిస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారా చంద్ మాట్లాడుతూ, అసిమ్ మునీర్‌ను "మానవత్వానికి శత్రువు" అని అభివర్ణించారు. మతతత్వ నాయకత్వం చేతిలో ఉన్న పాకిస్థాన్ అణ్వాయుధాలు ప్రపంచ భద్రతకు పెను ముప్పు అని, వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నప్పటికీ, చైనాను నిలువరించే వ్యూహంలో భాగంగా అమెరికా తన ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Marco Rubio
Pakistan
America
US Pakistan relations
Balochistan
Terrorism
Rare earth minerals
Asim Munir
Pahalgam attack
China

More Telugu News