నా సినీ ప్రస్థానంలో 'కూలీ' ఎప్పటికీ ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది: లోకేశ్ కనగరాజ్

  • రేపు (ఆగస్టు 14) ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కూలీ' 
  • రజినీకాంత్ సర్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా రూపుదిద్దుకుందని లోకేశ్ వెల్లడి
  • సినిమాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తలైవాకు హృదయపూర్వక శుభాకాంక్షలు
సూపర్‌స్టార్ రజినీకాంత్‌, యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం 'కూలీ'. ఈ చిత్రం రేపు (ఆగస్టు 14) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

"నా సినీ ప్రస్థానంలో 'కూలీ' సినిమాకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి కారణం రజినీకాంత్ సర్. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ తమ ప్రేమను, హృదయాన్ని ధారపోసి పనిచేశారు" అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు రజినీకాంత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రీకరణ సమయంలోనే కాకుండా, బయట కూడా రజినీకాంత్‌తో జరిపిన సంభాషణలను తాను ఎన్నటికీ మర్చిపోలేనని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "ఆ క్షణాలు నా జీవితంలో ఎంతో విలువైనవి. వాటిని ఎప్పటికీ మర్చిపోలేను. మా అందరికీ నిరంతరం స్ఫూర్తినిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని వివరించారు.

సినిమాల్లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు రజినీకాంత్‌కు లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "మీ నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం, మీతో పాటే పెరిగాం. వుయ్ లవ్ యూ తలైవా!" అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు. లోకేశ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More Telugu News