ఆసియా కప్‌కు భారత జట్టు.. ఎంపికపై సర్వత్రా ఆసక్తి

  • ఆసియా కప్ కోసం ఈ నెల 19 లేదా 20న భారత జట్టు ఎంపిక
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఆధారపడిన సెలక్షన్
  • టాప్ ఆర్డర్‌లో తీవ్ర పోటీ.. జైస్వాల్, సాయి సుదర్శన్‌లకు కష్టమే
  • రెండో వికెట్ కీపర్ స్థానం కోసం జితేశ్‌, ధ్రువ్ జురెల్ మధ్య పోటాపోటీ
  • మూడో పేసర్ స్థానం కోసం ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాల మధ్య తీవ్ర‌ పోటీ
ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన భారత క్రికెట్ జట్టు తదుపరి కీలక టోర్నీ ఆసియా కప్‌పై దృష్టి సారించింది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నెల 19 లేదా 20న సమావేశం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ సహా ఆటగాళ్లందరి ఫిట్‌నెస్‌పై బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుంచి వైద్య నివేదిక అందిన తర్వాతే తుది జట్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే సూర్యకుమార్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం గమనార్హం.

సెలక్టర్లకు టాప్ ఆర్డర్ తలనొప్పి
ప్రస్తుత భారత జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కూడిన టాప్-5 బలంగా ఉండటంతో, ప్రస్తుత కూర్పులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. అయితే, టెస్టుల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లోనూ రాణించడంతో అతడిని విస్మరించలేని పరిస్థితి.

"ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్. గత సీజన్‌లో సంజూ శాంసన్ బ్యాట్‌తో పాటు కీప‌ర్‌గానూ అద్భుతంగా రాణించాడు. కాబట్టి ఎంపిక కఠినంగానే ఉంటుంది. టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉండటం సెలక్టర్లకు అసలు సమస్య" అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపినట్లు సమాచారం. ఈ పోటీ కారణంగా యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌లకు జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక, వన్డేల్లో మొదటి ఎంపిక కీపర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ టీ20ల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయకపోవడంతో అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు.

కీపింగ్, ఆల్‌రౌండర్ల స్థానాలు
జట్టులో మొదటి వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ స్థానం దాదాపు ఖాయం కాగా, రెండో వికెట్ కీపర్ స్థానం కోసం జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఫినిషర్‌గా జితేశ్‌ ఆకట్టుకోగా, గత టీ20 సిరీస్‌లో జురెల్ జట్టులో ఉన్నాడు.

ఇక, ఆల్‌రౌండర్ల విషయానికొస్తే, హార్దిక్ పాండ్య ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి టోర్నీ నాటికి కోలుకోవడం అనుమానమే. దీంతో ఇంగ్లండ్‌పై రాణించిన శివమ్ దూబేకు జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు ఎంపిక కానున్నారు.

పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ జ‌ట్టులో ఉండ‌డం ఖాయం. కాగా, మూడో పేసర్ స్థానం కోసం ఐపీఎల్‌లో 25 వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ, అద్భుతమైన బంతులతో ఆకట్టుకుంటున్న హర్షిత్ రాణాల మధ్య తీవ్ర పోటీ ఉంది.


More Telugu News