ఏపీ లిక్కర్ స్కామ్... కీలక ఆధారాలతో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

  • ముగ్గురు నిందితుల పాత్రపై ఆధారాలను పొందుపరిచిన సిట్
  • ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని వెల్లడి
  • గత జులై 19న తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఏసీబీ కోర్టులో 200 పేజీలతో కూడిన రెండో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రలను వివరించింది. 

ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డు, గూగుల్ టేకౌట్, ల్యాప్ టాప్ లోని వివరాలను ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని తెలిపారు. ముడుపులు ఎవరెవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు? ఎవరెవరికి ఎంత చేరింది? అనే వివరాలను కూడా పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్ లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్టు తెలిపారు. 

లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి పలుమార్లు హాజరయినట్టు గూగుల్ టేకౌట్ సాక్ష్యాలను అటాచ్ చేశారు. బినామీ పేర్లతో పెట్టుబడులు కూడా పెట్టారని సిట్ అధికారులు తేల్చారు. గత జులై 19న 305 పేజీలతో సిట్ అధికారులు తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News