కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వెనుక ఈ ముగ్గురి కుట్ర ఉంది: వేముల ప్రశాంత్ రెడ్డి
- కాళేశ్వరం రిపోర్టు ఒక ట్రాష్ అన్న ప్రశాంత్ రెడ్డి
- దీని వెనుక రేవంత్, చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపణ
- చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకు కాళేశ్వరంపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు వెనుక... రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ కుట్ర ఉందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్టు ఈ ముగ్గురూ వండి వార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలో ఏముందో ముందే ఎలా రాశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
మేడగడ్డను పండబెట్టి, బనకచర్ల కోసం గోదావరి నీళ్లను గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చేందుకే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బ్యారేజ్ లో రెండు పిల్లర్లు కుంగిపోతే వాటిని బాగుచేసి రైతాంగానికి సాగునీటిని ఇవ్వాల్సింది పోయి... ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, అవినీతి జరిగిందని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
మొన్నటికి మొన్న 5 లక్షల క్యూసెక్కుల వరదను కూడా మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని నిటారుగా నిలబడిందని చెప్పారు. కావాలంటే చూసొద్దాం రావాలంటూ సవాల్ విసిరారు. గోదావరి నదిలో లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు వెళ్లిపోతున్నా వాడుకోకుండా, గుడ్లప్పగించి చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కుటిల బుద్ధి అని మండిపడ్డారు.