పాత జీన్స్‌తో కొత్త బట్టలు... ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ!

  • పాత డెనిమ్ వ్యర్థాలతో నాణ్యమైన దుస్తుల తయారీ
  • ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
  • 50 శాతం రీసైకిల్ నూలు వాడినా నాణ్యత, మృదుత్వంలో మార్పుండదు
  • పర్యావరణానికి భారీ మేలు, కాలుష్యం గణనీయంగా తగ్గుదల
  • ఇతర వస్త్ర వ్యర్థాలకూ ఈ టెక్నాలజీని విస్తరించే అవకాశం
వాడి పడేసిన పాత డెనిమ్ (జీన్స్) వస్త్రాలతో నాణ్యత ఏమాత్రం తగ్గకుండా మళ్లీ కొత్త దుస్తులను తయారుచేసే ఒక వినూత్న పద్ధతిని ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణతో, పేరుకుపోతున్న వస్త్ర వ్యర్థాల సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక ముందడుగు పడినట్లయింది.

భారత్‌లో ఏటా సుమారు 39 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థాలు పోగవుతున్నాయని, ఇందులో కేవలం 4 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోందని అంచనా. ప్రస్తుతం ఉన్న రీసైక్లింగ్ పద్ధతుల్లో దారాల పటుత్వం తగ్గిపోవడం, రంగు, నాణ్యతలో తేడాలు రావడం వంటి సమస్యలున్నాయి. అయితే, ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు కనుగొన్న కొత్త విధానంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఈ పద్ధతి ద్వారా తయారయ్యే అల్లిన (నిట్టెడ్) దుస్తుల్లో 50 శాతం వరకు రీసైకిల్ నూలును వాడినా, వాటి నాణ్యతలో గానీ, స్పర్శకు కలిగే అనుభూతిలో గానీ ఎలాంటి తేడా ఉండదని పరిశోధకులు నిరూపించారు.

ఈ పరిశోధన వివరాలను ప్రముఖ 'జర్నల్ ఆఫ్ క్లీనర్ ప్రొడక్షన్'లో ప్రచురించారు. వ్యర్థ డెనిమ్‌ను రీసైకిల్ చేసి నూలుగా మార్చే క్రమంలో ఫైబర్ గుణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ‘సీమ్‌లెస్ హోల్ గార్మెంట్ టెక్నాలజీ’ని ఉపయోగించి రీసైకిల్ నూలుతో దుస్తులను తయారుచేశారు.

"రీసైకిల్ నూలుతో వచ్చే గరుకుదనాన్ని తగ్గించడానికి, బట్టలకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌నెస్ ట్రీట్‌మెంట్ చేశాం. దీనివల్ల కొత్త వాటిలాగే పూర్తి మృదువుగా ఉంటాయి. ప్రస్తుతం డెనిమ్ వ్యర్థాలతో దీన్ని నిరూపించాం. భవిష్యత్తులో ఇతర వస్త్ర వ్యర్థాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించవచ్చు" అని ఐఐటీ ఢిల్లీ టెక్స్‌టైల్స్ అండ్ ఫైబర్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అభిజిత్ మజుందార్ తెలిపారు.

ఈ విధానం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలపైనా బృందం అధ్యయనం చేసింది. దీనివల్ల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, శిలాజ ఇంధనాల వాడకం వంటివి 30-40 శాతం వరకు తగ్గుతాయని, ఓజోన్ పొర క్షీణత సుమారు 60 శాతం వరకు తగ్గుతుందని వారి విశ్లేషణలో తేలింది. రీసైకిల్ ఫైబర్ల వాడకం పెరిగితే కొత్త పత్తి సాగు తగ్గుతుంది. తద్వారా పత్తి సాగుకు వాడే పురుగుమందులు, ఎరువులు, నీటిని కూడా ఆదా చేయవచ్చు. వస్త్ర వ్యర్థాలను పలుమార్లు రీసైకిల్ చేసే అవకాశాలపై ప్రస్తుతం తమ బృందం దృష్టి సారించిందని ప్రొఫెసర్ బీఎస్ బుటోలా వివరించారు.


More Telugu News