వైఎస్సార్ విగ్రహాన్ని దొంగల్లా తొలగించారు.. చెయ్యి విరిగిపోయింది: దేవినేని అవినాశ్

Devineni Avinash slams YSR statue removal in Nandigama
  • నందిగామలో వైఎస్ విగ్రహం తొలగింపు
  • ట్రాఫిక్ కు అడ్డంగా ఉందని తొలగించిన మున్సిపల్ అధికారులు
  • వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ అక్కడే ఏర్పాటు చేస్తామన్న అవినాశ్
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ కు అడ్డుగా ఉందని స్థానిక గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి సమయంలో మున్సిపల్ అధికారులు తొలగించారు. 

వైఎస్ విగ్రహాన్ని తొలగించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళన చేపట్టారు. వైసీపీ కార్యాలయం నంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. విగ్రహం తొలగించిన ప్రదేశంలో నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో మొబైల్ విగ్రహాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ మాట్లాడుతూ... కోర్టు దృష్టికి తీసుకెళితే, విగ్రహాన్ని తొలగించబోమని అధికారులు చెప్పారని... కానీ, అర్ధరాత్రి దొంగల్లా విగ్రహాన్ని తొలగించారని మండిపడ్డారు. వైఎస్ విగ్రహాన్ని చూస్తే చాలా బాధేసిందని... విగ్రహం చెయ్యి విరిగిపోయిందని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో నందిగామ ప్రశాంతంగా ఉందని... కానీ, కూటమి ప్రభుత్వం రాగానే కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే విగ్రహాన్ని తొలగించారో మళ్లీ అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Devineni Avinash
YSR statue
Nandigama
YS Rajasekhara Reddy
Andhra Pradesh politics
statue removal
YSRCP protest
TDP government
political tension
Goutham Reddy

More Telugu News