గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో!

  • లండన్‌లో కొత్త లుక్‌తో కనిపించిన విరాట్ కోహ్లీ
  • పూర్తిగా నెరిసిన గడ్డంతో ఉన్న ఫొటో నెట్టింట‌ వైరల్
  • కోహ్లీని చూసి గుర్తుపట్టలేకపోతున్నామంటున్న అభిమానులు
  • వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు
  • కోహ్లీ భవిష్యత్తుపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లండన్‌లో తీసిన ఈ ఫొటోలో కోహ్లీ పూర్తిగా నెరిసిన గడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. దాంతో ఆయన వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల లండన్‌లో ఒక అభిమానితో విరాట్ కోహ్లీ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఆయన గడ్డం చాలా వరకు తెల్లగా నెరిసిపోయి ఉంది. ఈ లుక్‌లో కోహ్లీని చూసిన చాలామంది అభిమానులు షాక్ అయ్యారు. కొందరైతే ఆయన్ను మొదట గుర్తుపట్టలేకపోయామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోబోతున్నారనే దానికి ఇదే సంకేతమంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

"వన్డే రిటైర్మెంట్ లోడింగ్?" అంటూ ఎంతోమంది మీమ్స్, పోస్టులు షేర్ చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోహ్లీ ఓ కార్యక్రమంలో తన గడ్డం గురించి సరదాగా మాట్లాడుతూ, "రెండు రోజుల క్రితమే గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలి" అని వ్యాఖ్యానించారు. అప్పుడు సరదాగా అన్న మాటలను ఇప్పుడు అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

కోహ్లీ శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, ఆయన తాజా రూపం మాత్రం రిటైర్మెంట్‌పై చర్చను మరింత పెంచింది. అయితే, తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన తదుపరి నిర్ణయం కోసం క్రికెట్ ప్రపంచం, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News