ఐటీఆర్ ఫైలింగ్: 30 రోజుల్లో వెరిఫికేషన్ చేయకపోతే మీ రిటర్న్ చెల్లదు!

ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) ఫైల్ చేశారా? అయితే మీ పని ఇంకా పూర్తి కాలేదు. ఆన్‌లైన్‌లో రిటర్నులు అప్‌లోడ్ చేసిన తర్వాత కేవలం 30 రోజుల్లోగా వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు దాఖలు చేసిన రిటర్నులు చెల్లనివిగా ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో వివరాలు సమర్పించినంత మాత్రాన ప్రక్రియ ముగిసినట్లు కాదని స్పష్టం చేస్తున్నారు.

2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 15తో ముగియనుంది. ఇప్పటికే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, ఫైలింగ్ తర్వాత అత్యంత కీలకమైన వెరిఫికేషన్ దశను నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గడువులోగా వెరిఫై చేయని రిటర్నులను శాఖ ప్రాసెస్ చేయదు.

వెరిఫికేషన్ ఎలా చేయాలి?
పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను రెండు పద్ధతుల్లో వెరిఫై చేయవచ్చు. మొదటిది... సులభమైన ఈ-వెరిఫికేషన్ పద్ధతి. రెండోది ఆఫ్‌లైన్ పద్ధతి.

ఆన్‌లైన్‌లో అయితే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా క్షణాల్లో వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఇది చాలా సులభమైన, వేగవంతమైన పద్ధతి. ఇందుకు ఈ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in) లోకి లాగిన్ అయి, 'ఈ-వెరిఫై రిటర్న్' ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ 'ఆధార్ ఓటీపీ'ని సెలెక్ట్ చేసుకుని, మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా, ఏటీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) జనరేట్ చేసి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) ఉన్నవారు దాని ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు.

ఒకవేళ ఆఫ్‌లైన్ పద్ధతిని ఎంచుకుంటే, ఐటీఆర్-వి అక్‌నాలెడ్జ్‌మెంట్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, దానిపై సంతకం చేసి, ఫైల్ చేసిన 30 రోజుల్లోగా బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పోస్టులో పంపాలి. అయితే, ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది.

గడువు దాటితే ఏం చేయాలి?
ఏదైనా కారణం చేత 30 రోజుల గడువులోగా వెరిఫికేషన్ పూర్తి చేయలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోనే 'ఆలస్యం మన్నింపు అభ్యర్థన' (Condonation of Delay) పెట్టుకోవచ్చు. ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ అభ్యర్థన సమర్పిస్తే, ఆదాయపు పన్ను శాఖ దానిని ఆమోదించే అవకాశం ఉంటుంది. శాఖ ఆమోదం తెలిపితే మీ రిటర్న్ వెరిఫై అయినట్లే పరిగణిస్తారు.


More Telugu News