మత మార్పిడి, పెళ్లికి నిరాకరించిన యువతి.. గొంతు కోసి హత్యచేసిన నిందితుడు

  • మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • ఇంట్లోకి చొరబడి గొంతు కోసి, కత్తితో విచక్షణ రహితంగా దాడి
  • కొన్ని గంటల్లోనే నిందితుడి అరెస్ట్
  • నిందితుడిని ఉరితీయాలని డిమాండ్లు
ఇస్లాం మతంలోకి మారేందుకు, వివాహం చేసుకునేందుకు నిరాకరించినందుకు 35 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు భాగ్యశ్రీ నామ్‌దేవ్ ధనుక్ ఇంట్లో ఉండగా షేక్ రాయీస్ (42) అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి గొంతు కోశాడు. అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మతమార్పిడి, వివాహం కోసం రాయీస్ చాలా కాలంగా తన సోదరిని వేధిస్తున్నాడని, జుట్టు పట్టుకుని ఈడ్చేవాడని, కొట్టేవాడని, దారుణంగా హింసించేవాడని బాధితురాలి సోదరి సుభద్రబాయి తెలిపారు. మతమార్పిడికి, అతనితో పెళ్లికి నిరాకరించడంతో రాత్రి ఇంట్లోకి చొరబడి గొంతు కోశాడని వివరించారు.  

ఈ ఘటన హిందూ సమాజంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఇది ‘లవ్ జిహాద్’లో భాగమని ఆరోపిస్తున్నారు. మూడు నాలుగు రోజుల క్రితమే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అయినప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని మాజీమంత్రి అర్చన చిటినిస్ పరామర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  


More Telugu News