హైదరాబాద్ శివారులో డ్రగ్స్ పార్టీ .. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్టు
- ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకున్న ఐటీ ఉద్యోగులు
- అర్ధరాత్రి ఆకస్మికంగా ఫామ్ హౌస్పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు
- ఫామ్ హౌస్ నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో జరిగింది. నిందితుల నుంచి 0.5 గ్రాముల ఎల్ఎస్డీ బ్లాట్స్, 20 గ్రాముల హ్యాష్ ఆయిల్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చేవెళ్ల ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి నిన్న మీడియాకు తెలియజేశారు.
ఐటీ ఉద్యోగులైన అభిజిత్ బెనర్జీ, సింప్సన్, పార్ధు, గోయల్, యశ్వంత్ రెడ్డి, సెవియో డెన్నిస్లు మొయినాబాద్ మండలం మేడిపల్లిలోని సెరీస్ ఆర్చర్ట్స్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ సీఐ బిక్షపతి, ఎస్ఐ బాలరాజు సిబ్బందితో అర్ధరాత్రి దాడి చేశారు.
ఆరుగురిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా, వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఫామ్ హౌస్ నిర్వహకుడిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.