Puri Girl Death: నిప్పంటించుకున్న బాలిక ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతి.. కేసులో ట్విస్ట్

Puri Girl Death Mysterious Twist in Case
  • గత నెల 19న బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించినట్టు ఆరోపణలు
  • ఆపై నిప్పు పెట్టినట్టు బాలిక తల్లి ఫిర్యాదు
  • చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన బాలిక
  • తనకు తానే నిప్పు పెట్టుకున్నట్టు మేజిస్ట్రేట్ ఎదుట బాలిక వాంగ్మూలం
ఒడిశాలోని పూరి జిల్లాలో జులై 19న జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. బలంగ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి, నిప్పంటించారని ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ధృవీకరించారు.

జులై 19 ఉదయం బాలిక తన స్నేహితుడి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అపహరించి భార్గవి నది ఒడ్డున ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారని ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు ఆరోపించారు. ఈ ఘటనలో బాలికకు 75 శాతం కాలిన గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమె అరుపులు విని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కానీ 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక నిన్న మృతి చెందింది.

ముఖ్యమంత్రి సంతాపం.. పోలీసుల ట్విస్ట్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి తనను కలచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతి ఘటనలో మరెవరి ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. తానే స్వయంగా నిప్పు అంటించుకున్నట్టు ఢిల్లీలోని మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో బాలిక పేర్కొన్నట్టు చెప్పారు. 

ఈ ఘటన ఒడిశాలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు నేతలు బాలిక మృతికి సంతాపం తెలిపారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ ఏడు రోజుల్లో దోషులను అరెస్టు చేయకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ వివాదంపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ “నా కుమార్తె మరణం గురించి రాజకీయాలు చేయవద్దు. ప్రభుత్వం సహకరించింది. నా కుమార్తె మానసిక కుంగుబాటు కారణంగా ప్రాణాలు కోల్పోయింది” అని పేర్కొన్నారు. 
Puri Girl Death
Puri
Odisha
Delhi AIIMS
Mohan Charan Majhi
Naveen Patnaik
Bhakta Charan Das
Girl self immolation
Suicide case
Political Controversy

More Telugu News