హనీమూన్‌కు వెళ్లిన దంపతుల మృతి .. పర్యాటక సంస్థకు భారీగా జరిమానా

  • 2023లో హనీమూన్‌‌కు వెళ్లిన ‌దంపతుల మృతి
  • చెన్నై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన మృతురాలి తండ్రి
  • పర్యాటక సంస్థ సేవా లోపం కారణంగానే ఇద్దరూ మృతి చెందారని తేల్చిన కమిషన్
  • పర్యాటక సంస్థ రూ.1.60 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశం
హనీమూన్‌కు వెళ్లిన వైద్య దంపతుల మృతి కేసులో పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి పర్యాటక సంస్థ రూ.1.60 కోట్ల జరిమానా చెల్లించాలని తాజాగా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన డాక్టర్ విభూష్ణియా, డాక్టర్ లోకేశ్వరన్‌కు 2023 జూన్‌లో వివాహం కాగా, జీటీ హాలిడేస్ సంస్థ ఏర్పాట్లతో వీరు హనీమూన్‌కు ఇండోనేసియా వెళ్లారు. అక్కడి సముద్రంలో మోటారు బోట్‌లో వారిద్దరూ ఫొటో షూట్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి మరణించారు.

దీనిపై చెన్నై పూందమల్లి సమీప చెన్నీర్ కుప్పంకు చెందిన విభూష్ణియా తండ్రి తిరుజ్ఞానసెల్వం వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఆ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నా సంబంధిత సంస్థకు చెందిన గైడ్ నిర్లక్ష్యం, సేవా లోపం కారణంగానే తన కుమార్తె, అల్లుడు అలల్లో కొట్టుకుపోయి మృతి చెందారని తెలిపారు.

సంస్థ సేవా లోపాన్ని పరిశీలించి, రూ.1.50 కోట్ల నష్టపరిహారం, కుమార్తె, అల్లుడిని కోల్పోవడంతో తనకు ఏర్పడిన మానసిక ఆందోళనకు రూ.50 లక్షలు పరిహారంగా ఇప్పించాలని కోరారు. పర్యాటక సంస్థ సేవా లోపం కారణంగానే ఇద్దరూ మృతి చెందారని చెన్నై వినియోగదారుల కమిషన్ తేల్చింది.

ఈ క్రమంలో బాధిత కుటుంబానికి రూ.1.50 కోట్ల పరిహారం, తిరుజ్ఞానసెల్వం అనుభవించిన మానసిక ఒత్తిడికి రూ.10 లక్షలు సంస్థ చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 


More Telugu News